నిజామాబాద్ క్రైమ్ అక్టోబర్ 20, ( ప్రజా గళం )
కానిస్టేబుల్ ను దారుణంగా పొడిచి చంపిన పాత నేరస్తుడు రియాజ్ ఎట్టకేలకు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు హంతకుడు రియాజ్ ఎన్ కౌంటర్ తో తెరపడింది. సారంగాపూర్ ప్రాంతంలో అరెస్టు సందర్భంగా గాయపడిన రియాజ్ కు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆసుపత్రిలోని నాల్గవ అంతస్తులో గల 4o7 గది నుండి మరోసారి పారిపోయే ప్రయత్నం చేశాడు. బాత్రూంకు వెళ్లి వచ్చిన రియాజ్ గది బయట బందోబస్తు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు.ఈ పెనుగులాటలో ఏ ఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న రియాజ్ పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ మృతితో ప్రభుత్వ ఆసుపత్రి బయట పోలీసులు, ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజమైన నరకాసుర సంవరణ జరిగిందని ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. రియాజ్ ఎన్కౌంటర్ తో కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరిందని పలువురు పేర్కొన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యులు రియాజ్ మరణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నరహంతకుడికి సరైన శిక్ష పడిందని ప్రమోద్ కుటుంబ సభ్యులు అన్నారు. రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర డీ జీ పీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని డీ జీ పీ హామీ ఇచ్చారు. ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పోలీస్ సంక్షేమ నిధి నుండి 18 లక్షలు ఇస్తామని డీజీపీ వెల్లడించారు. ఇదే విషయాన్ని పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘతo కలిగించే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.
