నామినేటెడ్ పదవుల పై చిగురిస్తున్న ఆశలు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు వారికే నా! ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశవావులు.

 

 

నిజామాబాద్ జులై 29 (ప్రజాగళం ప్రతినిధి )

 

అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీపై నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమైన తెలంగాణ పార్టీ నేతలు మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల పై నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులపై సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు కింది స్థాయి నాయకులు పదవుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి నాలుగు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీ అయిన విషయం విధితమే. అయితే వారికే పదవులు అప్పగిస్తారా లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేదానిపై పార్టీలో ఉత్కంఠత నెలకొంది. కామారెడ్డి జిల్లా నుండి కార్పొరేషన్ పదవిలో ఇప్పటివరకు కొనసాగిన కాసుల బాలరాజ్ తో పాటు, నిజామాబాద్ జిల్లా నుండి ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిల పదవులు ఖాళీ అయిన విషయం తెలిసిందే. మరోసారి హై కమాండ్ తమకు అవకాశం కల్పిస్తుందని సదరు నాయకులు పూర్తి భరోసాతో ఉన్నారు. దీంతో పాటు తమకున్న పరిచయాలతో పైరవీలు సాగిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన ద్వారా పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. నిరంతరం పార్టీ కోసం పని చేసే సీనియర్ నాయకులు ఈసారి తమకు ఎలాగైనా నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నరాల రత్నాకర్ లు నామినేటెడ్ పదవుల కోసం ఆశిస్తున్నారు. బుధవారం ఢిల్లీలో జరుగుతున్న కీలక సమావేశంలో నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ల పదవిపై కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.