నిజామాబాద్ సిటీ ఆగస్టు 1 (ప్రజా గళం )
నగరంలో జరగనున్న ఊర పండుగ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ శనివారం కాలి నడకన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా పండుగ జరిగే ప్రధాన మార్గాలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు, తాగునీటి వసతి, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్వహణ, రహదారుల పరిస్థితి తదితర అంశాలను మేయర్ స్వయంగా పరిశీలించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పండుగ ముగిసే వరకు మున్సిపల్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఊర పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మేయర్ తో పాటు మున్సిపల్ ఏఎంసి నజీర్, ఏఈ వాజిద్,శానిటరీ సూపర్వైజర్ సాజిద్,శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

