నిజామాబాద్ క్రైమ్ ఆగస్టు 13 (ప్రజాగళం )
నేరాలను నియంత్రించడంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఆర్మూర్ డివిజన్ కు సంబంధించి నేరాల నియంత్రణ పై సమీక్ష సమావేశం గురువారం నందిపేట్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ,రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని , అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు.సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని , ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు , రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నిజామాబాద్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య , హత్యాయత్నం , చోరీలు , మహిళలపై నేరాలు , సైబర్ మోసాలు , డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా , పేకాట , గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని , రౌడీషీటర్లు , పాత నేరస్తులు , బెయిల్పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి , అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని , షీ టీమ్స్ , ఈగల్ టీమ్స్ , చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు , బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
పేకాట , గుట్కా , ఇసుక, ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని , ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్ నిర్వహణ , రికార్డుల నిర్వహణ , స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి , నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకొని , రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి , సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతూ ఉండేటటువంటి లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం , రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధముగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని , ఓవర్ స్పీడ్ , త్రిబుల్ డ్రైవింగ్ , మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
డయల్ 112 గురించి ప్రజల వద్దకు చేరే విధంగా అనుక్షణం కృషి చేయాలన్నారు.
రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని , వాహనాల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని , వాహనాల తనిఖీలు సమయంలో సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు.ఈ కార్యక్రమం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీసీఆర్ బి ఏసీపీ గురునాయుడు , సి.సి.ఆర్బి ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , సీ.ఐ లు, ఎస్సై లు పాల్గొన్నారు.

