నిజామాబాద్, జూలై 29 ( ప్రజాగళం ప్రతినిధి )
విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపద మిత్ర వాలంటీర్లు తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఆపద మిత్ర వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. విపత్తుల సమయాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపకరించే 14 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్ ను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఎస్ డీ ఆర్ ఎఫ్ అధికారులు తెలియజేశారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి, అత్యవసర సమయాలలో ప్రాథమిక చికిత్స పద్ధతులు, సీ.పీ.ఆర్ చేసే విధానం, తదితర అంశాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ, విపత్తులను నిలువరించే శక్తి ఎవరికీ ఉండదని, అయితే ముందస్తు సన్నద్ధతతో ప్రాణ, ఆస్తి నష్టాల్ని చాలా వరకు నివారించవచ్చని అన్నారు. ఈ దిశగా క్షేత్రస్థాయిలో ఉండే ఆపద మిత్ర వాలంటీర్లు విపత్తుల సమయాలలో సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఇప్పటికే వాలంటీర్లకు ప్రకృతి వైపరీత్యాల సమయాలలో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ అందించామని గుర్తు చేశారు. నేర్చుకున్న అంశాలను విస్మరించకుండా ఆపద సమయాలలో ప్రజలకు సహాయకారులుగా నిలవాలని ఉద్బోధించారు. అదే సమయంలో స్వీయ రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
జిల్లా రెవెన్యూ అధికారి గీత మాట్లాడుతూ, ఆపద సమయాలలో ప్రజలకు సహాయపడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావించాలని అన్నారు. ఆపద మిత్ర నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సాయన్న మాట్లాడుతూ, ఆపద మిత్ర వాలంటీర్లకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డులు, ఉపకరణాలతో కూడిన కిట్లు అందజేసిందని, బీమా సదుపాయం వర్తింపజేస్తుందని గుర్తు చేశారు. ఈ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ డీ-సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ, 7వ పోలీసు బెటాలియన్ అధికారులు, ఆపద మిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.

