నిజామాబాద్ సిటీ జూలై 29 (ప్రజాగళం )
భారతీయ సాంప్రదాయంలో గురువు స్థానం దైవంతో సమానమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. గురు పూర్ణిమను పురస్కరించుకొని బుధవారం నగరంలోని బింగి కళ్యాణ మండపంలో గురువు కోన సముందర్ శ్రీనాథ్ శర్మ దంపతులకు కుటుంబసమేతంగా పాద పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గురువులు జీవితంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదిస్తారని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న గురు శిష్య సంప్రదాయానికి ఈరోజు ప్రతీకగా నిలుస్తుంది అన్నారు. అనేకమంది సన్యాసులు, యోగులు ఈ రోజున కొత్త దీక్షలు, జపాలు, సాధనలు ప్రారంభిస్తారని తెలిపారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువే పరబ్రహ్మ స్వరూపుడన్నారు. గురువులకు పాదపూజ చేయడం, తోచిన దక్షిణ, వస్త్రాలు, పండ్లు, పుస్తకాలు, సమర్పించడం

ఆనవాయితీ అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జీవితానికి అర్ధాన్ని నేర్పుతారని అన్నారు. జ్ఞానం, వినయం, సంస్కారం, ధర్మం విలువలను గుర్తు చేసే పవిత్ర పర్వదినం అని వివరించారు. అంతకుముందు మల్లారంలోని దత్త ఆశ్రమాన్ని దర్శించుకున్నారు.

