ప్రజాగళం, నిజామాబాద్ సిటీ : పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని అదనపు డీసీసీ బస్వారెడ్డి అన్నారు. శివాని నాట్యాలయం 20 వార్షికోత్సవ వేడుకలు డ్యాన్స్ ఫెస్టివల్ పురస్కరించుకుని ఆదివారం జరిగిన కార్యక్రమానికి డీసీసీ బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చూస్తే కన్నుల పండుగుగా ఉందన్నారు. ప్రస్తుతం కళలు అంతరించిపోతున్న సమయంలో చిన్నారులకు నాట్యం, భరతనాట్యం, కూచిపూడి లాంటివి శిక్షణ ఇస్తున్న శివాని నాట్యాలయం నిర్వాహకులు నవనీతకు, చిన్నారులను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారిని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాలన్నారు. చిన్నపిల్లలు మొక్క లాంటివారని ఎలా పెంచితే అలా పెరుగుతారని అన్నారు. పిల్లలను చిన్నప్పుడు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తే వారు మానసికంగా అభివృద్ది చెందుతారన్నారు.

మరో అతిథి విజయానంద్ మాట్లాడుతూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన శివాని నాట్యమండలి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు నాట్యం నేర్పడంతో వారి తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లిబర్టి పాఠశాల చైర్మన్ గోవర్ధన్, తదితరులున్నారు.
