నిజామాబాద్ అక్టోబర్ 6 ( ప్రజాగళం ప్రతినిధి )
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఎలాగైనా ఈ సీటును గెలుచుకునేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేపట్టింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రాజకీయ పలుకుబడి ఉన్న నిజామాబాద్ జిల్లా నేతలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కీలక బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి తో పాటు, అన్వేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నుడా చైర్మన్ కేశ వేణు, మరో సీనియర్ కాంగ్రెస్ నేత తాహెర్ బిన్ హందాన్ లకు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. జూబ్లీహిల్స్

నియోజకవర్గం లోని సోమాజిగూడ, బోరబండ, రహత్ నగర్ తదితర ప్రాంతాలలో ఈ నలుగురు నాయకులను ఇంచార్జ్ లుగా పార్టీ ఐ కమాండ్ నియమించింది. దీంతో ఈ నలుగురు హైదరాబాద్ లో తమకు అప్పగించిన ప్రాంతాల్లో మకాం వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచార బాధ్యతలను నిర్వర్తించనన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో నియోజకవర్గం లోని ఓట్ల పరిశీలన, తదితర అంశాలపై జిల్లా నాయకులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎన్నికలకు సంబంధించిన పూర్తిస్థాయి అవగాహనతో పాటు, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను రూపొందించుకున్నారు. మరో రెండు, మూడు రోజులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉండడంతో ముందుగానే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని తమకు అప్పగించిన ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యచరణ రూపొందించనున్నారు. తమపై ఎంతో నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలలో తమకున్న పరిచయాలతో ఓట్లను ఎక్కువ సంఖ్యలో తమ పార్టీకి వచ్చేలా కృషి చేస్తున్నారు.

