నిజామాబాద్, డిసెంబర్ 12 (ప్రజా గళం ప్రతినిధి)
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ముప్కాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్ చే అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులు సందర్శించిన సందర్భంగా కలెక్టర్ పీ.ఓలకు కీలక సూచనలు చేశారు. హ్యాండ్ బుక్ లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు

తావులేకుండా సజావుగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని అన్నారు. పి.ఓలు చేపట్టాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని, తప్పులు జరిగితే క్రమ శిక్షణ చర్యలకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించారు. సమయ పాలన పక్కాగా పాటించాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ మెటీరియల్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద బి.ఎల్.ఓ సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఓటరు స్లిప్ ఐడి కాదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 18 రకాల ఐడి కార్డులలో ఏదైనా ఒక దానిని ఓటరు తీసుకురావచ్చని తెలిపారు. ఈ విషయమై విస్తృత స్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆర్.ఓ కు మినహా మిగతా ఎవరికి కూడా పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంధులు ఓటు వేసే సందర్భంగా పీఓ, ఓపీఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ కంపార్ట్మెంట్ లోనికి వెళ్ల కూడదని, సహాయకులుగా వచ్చిన వారికి కుడి చేతి మధ్య వేలుకు సిరా చుక్క వేయాలన్నారు. రిపోలింగ్ కు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తయ్యేలా జాగ్రత్తగా ఎన్నికలు జరపాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ తరగతులలో ఆర్.ఓ లు, స్థానిక అధికారులు, పీ.ఓలు పాల్గొన్నారు.

