నిజామాబాద్ ఫిబ్రవరి 10 ( ప్రజా గళం ప్రతినిధి )
పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా డిమాండ్ కు అనుగుణంగా వంట గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు అందించేందుకు వీలుగా ముందస్తుగానే సరిపడా స్టాక్ ను తెప్పించుకోవాలని సూచించారు.

వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, గ్యాస్ సిలిండర్ల పంపిణీ తీరును నిశితంగా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, అధికారులు అరవింద్ రెడ్డి, రవి రాథోడ్, ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.

