నిజామాబాద్ బ్యూరో ఫిబ్రవరి 26 (ప్రజా గళం ప్రతినిధి)
సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పునఃనిర్మాణం, విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించడం జరిగింది. పునఃనిర్మాణం అనంతరం ఆలయం మరింత వైభవంగా, శోభాయమానంగా దర్శనమిస్తోంది. భక్తుల భారీ సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ,
“శ్రీ వాసవి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక. ఇలాంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణం మన సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు బలాన్నిస్తుంది. ఆలయాలు సమాజ ఐక్యతకు కేంద్రబిందువులు” అని పేర్కొన్నారు.
అలాగే అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

